తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ల భరతం పట్టే పనిలో పడింది. ఐదుమంది సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందంతో సిట్ వేసి.. దాని మూలాలను పెకలించేందుకు లోతైన ఇన్విస్టేగేషన్కు ఆదేశించింది. 90రోజుల్లో బెట్టింగ్ యాప్స్ అంతు చూడాలని నిర్ణయించుకుంది. సీఐడీ అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్స్పై విచారణ జరుగనుంది. సిట్ బృందంలో ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన కేసులన్నిటినీ దర్యాప్తు చేసి….బెట్టింగ్ను నిరోధించే చర్యలను తెలంగాణ ప్రభుత్వానికి సూచించబోతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ..క్రికెట్, క్యాసినో గేమ్లను అందుబాటులోకి తీసుకువచ్చి డబ్బు వ్యామోహం ఉన్నవారిని,ఆశ చూపింది సామాన్యులను, అమాయకులను టార్గెట్ చేస్తున్నాయి. వీరి వద్ద నుంచి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నాయి. కాగా బెట్టింగ్ యాప్స్ కు బలవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవడంతో పాటు..బెట్టింగ్ యాప్స్పై అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లో ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లతో పాటు, 19 మంది యాప్ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగాక కూడా ఈ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు ఘటనలు ఆగలేదు..దీంతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
తెలంగాణలో బెట్టింగ్ అన్న పేరు వినిపించకుండా చర్యలు తీసుకోవడమే సిట్ ప్రధాన లక్ష్యం.నిజానికి ఇది ఓరకంగా సిట్కు సవాలే . ఎందుకంటే సిట్ బృందం ఆన్లైన్ బెట్టింగ్ కేసులన్నిటిని లోతుగా విచారించాలి. ఈ యాప్స్ వెనుక నిర్వాహకులు, ఆర్థిక మూలాలు, సాంకేతిక వ్యవస్థలను గుర్తించడం అంత ఈజీ కాదు. ఈ యాప్స్ అన్నీ చైనా, దుబాయ్, హాంకాంగ్ నుంచి నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలు హవాలా, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును తరలిస్తున్నాయి. హైదరాబాద్లో ఒక్క కేసులోనే ఏకంగా 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు తేలింది.ఇప్పుడు ఈ డబ్బు మార్గాలను ఛేదించి, నేరస్థులను శిక్షించే ఆధారాలను సిట్ సేకరించాలి. అంతేకాదు, బెట్టింగ్ యాప్స్ పీడను శాశ్వతంగా వదిలించే బాధ్యత సిట్దే.
ఇలా అనేక సవాళ్లతో కూడిన బెట్టింగ్ యాప్స్పై దర్యాప్తును సిట్ ఇప్పుడు చేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్లు ఉండటంతో.. వీటిని గుర్తించడం, వాటి సర్వర్లను ట్రాక్ చేయడం సాంకేతికంగా కూడా చాలా కష్టం. ఈ యాప్స్ అన్నీ కూడా స్థానిక ఏజెంట్లు, ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారానే తమ ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు వీరిని చట్టపరంగా శిక్షించడం అంత సులభం కాదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఈ దర్యాప్తును ప్రభావితం చేస్తాయి. దీంతో అడుగడుగునా అడ్డంకులతో ఈ బృందం స్వతంత్రంగా పని చేస్తూ 90 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంది.