
ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్.. బీఆర్ ఎస్ గా మారి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి గల కారణాల్లో ఒకటి అని పార్టీలోనూ చర్చ జరిగింది. దీంతో బీఆర్ ఎస్.. టీఆర్ ఎస్ గా మళ్లీ మారనుందని ప్రచారం జరిగింది. అయితే.. గులాబీ బాస్ కేసీఆర్ ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ పేరు మార్చేది లేదని తెలిపారు. కాగా.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ ఎస్.. ఉద్యమ పంథావైపు నడుస్తోంది. ప్రజలు, రైతుల తరఫున వరుస ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. నిత్యం ప్రజల్లో ఉండి పార్టీని బలోపేతం చేసుకునే పనిలో నేతలు ఉన్నారు. బీఆర్ ఎస్ పని అయిపోయిందని, అధికార పార్టీ ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో పలు కార్యక్రమాల ద్వారా శ్రేణుల్లో జోష్ నింపి.. ఎవరూ ఎటూ పోకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా పార్టీ మార్పుపై మాట్లాడుతూ.. తానెందుకు బీఆర్ ఎస్ ను వీడతానని, కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే రకమైన చైతన్యం ఇతర నాయకుల్లో కూడా వచ్చేలా గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ బీఆర్ ఎస్ చేపట్టిన ఆందోళనల్లో పార్టీ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని రైతులు గత ఐదు రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని, వడ్లను ఎఫ్సీఐ కేంద్రాలకు తరలించి 25 రోజులు అవుతున్న ఎలాంటి తూకం జరగడం లేదన్నారు. ఈ క్రమంలో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని రైతులు కూడా రోడ్లపైకి వచ్చి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లుల వద్ద ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిచిపోయిందని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో భువనగిరి జిల్లా రైలులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ ఆందోళనల ద్వారా మరోసారి బీఆర్ ఎస్ నేతలంతా కలిసికట్టుగా ముందుకు వచ్చారు. రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా చేపట్టారు. వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిర్ణయించడమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని అందుకే నాలిక తిప్పేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఎప్పటి మాదిరిగానే నయ వంచనకు పూనుకున్నారని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం అన్న మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే ఆ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవారని తెలిపారు. హక్కులను సాధించేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడు వారి పక్షాన కొట్లాడుతుందని చెప్పారు. రైతులకు భరోసా కల్పించేందుకు నిరసనలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి వారికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తన విమర్శల ద్వారా పార్టీలో జోష్ నింపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY