అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్తో పిలుద్దామని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో.. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్కు పర్యాయ పదంగా నిలుస్తుందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి .. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని.. టెక్ యూనికార్న్ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు.
ఐటీ యూనికార్న్ ప్రతినిధులను తెలంగాణకు రావాలని రేవంత్ ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చదిద్దుకుందామంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.అలాగే తెలంగాణలో ప్రపంచ టెక్ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్బాబు . మొత్తంగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ బృందం.. తెలంగాణకు వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్తోనూ భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న సీఎం.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని కొంతమంది గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబ్ సీఈవోతో జరిగిన సమావేశంలో సీఎంతో పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై అడోబ్ సిస్టమ్ సీఈఓ శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకోవడానికి కూడా ఆయన అంగీకరించారు. ఇటు టెక్ విజనరీ శంతను నారాయణ్ను తాను కలుసుకోవటం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.