మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు: సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడు.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని కౌంట‌ర్ ఇచ్చారు. బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం మిమ్మల్ని మరిచిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. 1 కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90 వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21 వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది’ అని సీఎం వ్యాఖ్యానించారు.

‘కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు. కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం. మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండని సూచించారు. బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామ‌ని ఎద్దేవా చేశారు.