శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కి.మీటర్ వద్ద పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీ డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి శనివారం అర్ధరాత్రే.. ఘటన స్థలానికి రక్షణ బృందాలు ఒక్కొక్కటిగా చేరుకున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి.
ప్రమాద ఘటన కోసం.. మొత్తం సహాయక చర్యల్లో 24 మందితో ఆర్మీ బృందం.. 130 మంది ఎన్డీఆర్ఎఫ్.. 24 మంది హైడ్రా బృందం.. 24 మంది సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్.. 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే మట్టి, నీరు వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే ఇప్పటి వరకు 13.5 కి.మీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లినా కూడా ఇంకో అర కిలోమీటర్ వెళ్లడానికి నీరు, మట్టి అడ్డంకులు కల్పిస్తున్నాయి.
నీరు, మట్టి, బురదను తోడటానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. అయితే 200 మీటర్ల గ్యాప్ లోనే మిస్ అయిన 8 మంది ఉన్నారని తెలుస్తోంది. పనులు జరుగుతున్న సమయంలో ఉదృతంగా నీరు రావడం వల్ల టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. టన్నెల్ మిషన్ రావడం వల్ల సుమారు 200 మీటర్లలో గ్యాప్ ఏర్పడగా.. ఆ గ్యాప్ లోనే 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది.
అందులో చిక్కుకున్న వారి పేర్లతో రెస్క్యూ బృందాలు పిలుస్తున్నా కూడా వారి నుంచి ప్రతిస్పందన లేదు. మరోవైపు రెస్క్యూ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం కనిపించినట్టు తెలుస్తోంది. అయితే సొరంగం పైకప్పు కూలడం వల్ల టన్నెల్ బోరింగ్ మిషన్ మట్టిలో పూడుకు పోయింది. అయితే చిక్కుకున్న 8 మందిలో ఇద్దరు ఇంజనీర్లతో పాటు.. ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. సహాయక చర్యలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ తో పాటు.. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
తాజాగా SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ర్యాట్ హోల్స్ మైనర్స్ను తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించింది. వీరిని రంగంలోకి దించడానికి కారణం కూడా ఉంది. 2023లో ఉత్తరాఖండ్లో సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా.. 17 రోజుల వరకు ప్రయత్నించినా కూడా వారిని అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ర్యాట్ హోల్ టీమ్ రంగంలోకి దిగి.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. యంత్రాల సహాయంతో అనుబంధ సొరంగాలు తవ్వి.. ఆ తర్వాత వారిని ఒక రోజుకే బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎస్ఎల్బీ సీ సొరంగంలో చిక్కుపోయిన వారిని కూడా ర్యాట్ హోల్ మైనర్స్ అలాగే బయటికి తీసుకొస్తారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.