కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, దీనికి సంబంధించిన ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదని సమాచారం. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనుండటంతో.. ఇక రేషన్ కార్డులతో అవసరం లేదని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అధికారులు నేటి నుంచి 5 రోజుల పాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో.. కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసినప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన రిపోర్టును తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే అవి పూర్తిగా సవరించుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని సూచించారు.
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని.. అధికార బృందాలు ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాలకు వెళ్లి.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్టోబర్ 3 నుంచి 7 వ తేదీ వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాలకు వెళ్లిన బృందాలు.. ఆ కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తేనే ఫోటో తీయాలని, అది కేవలం ఆప్షన్ గా మాత్రమే ఉండాలని సీఎం చెప్పారు. రేషన్ కార్డు, రైతు భరోసా, రుణమాఫీ, పింఛను-స్వయం సహాయక సంఘాలు, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి వివిధ పథకాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారం..గా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.