భూముల క్రమబద్ధీకరణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఫ్రభుత్వం ..లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఫీజులో 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు సమీక్ష చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసినవారందరికీ కూడా ఎల్ఆర్ఎస్లో అవకాశం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన లేఔట్లలో.. మిగిలిన ప్లాట్లు కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్ పేరుతో నిషేధిత జాబితాలోని భూములను మాత్రం క్రమబద్ధీకరణ చేసుకోకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపిన ప్లాట్లను..ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఒక లేఔట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మిగిలిన 90 శాతం కూడా ఎల్ఆర్ఎస్ స్కీములో క్రమబద్ధీకరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ప్లాట్ల క్రమబద్ధీకరణకు చెల్లించే ఫీజులో 25 శాతం రాయితీని కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే లక్ష రూపాయలు చెల్లించాల్సిన వారు 75 వేల రూపాయలు చెల్లించి ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద చెల్లింపులు జరిపి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
2020లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. తర్వాత కోర్టు కేసుల వల్ల ఈ క్రమబద్ధీకరణ జరుగలేదు. అయితే కోర్టు తీర్పు 2023లో వచ్చినా కూడా.. అప్పటికే ఎన్నికలు సమీపించడంతో క్రమబద్ధీకరణ పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల డిమాండ్లు పెరగడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి క్రమబద్ధీకరించాలని సూచించడంతో..అధికారులు రెగ్యులరైటేజషన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.