ఢిల్లీకి తెలంగాణ రాజకీయం.. ఆసక్తి రేపుతున్న నేతల హస్తిన పర్యటన

Telangana Politics in Delhi: Leaders' Visit to the Capital Sparks Interest

ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితమైన కుంభకోణాల రాజకీయం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తెలంగాణకు చెందిన కీలకమైన ముగ్గురు వ్యక్తులు హస్తినలో మకాం వేయడంతో..తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా హస్తన వెళ్లారు. మరోవైపు గవర్నర్ ఢిల్లీ పర్యటన కూడా ఇప్పుడే ఉండటంతో అనేక చర్చలకు దారి తీస్తోంది.

అమృత్ పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న కేటీఆర్.. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు. టెండర్లు రద్దు చేసి వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి భావమరిది అయిన సృజన్ రెడ్డికి ఈ టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇవే కాకుండా మరిన్ని కుంభకోణాలు రాబోతున్నాయంటూ హింట్లు ఇస్తున్నారు. సీరియల్ మాదిరి అన్ని శాఖల్లో జరిగిన అవినీతిని తాము వెలికి తీస్తామని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను జాతీయ స్థాయిలో ఎండగడ్డటానికి ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్లి వస్తామని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు.

కేటీఆర్ ఢిల్లీ వెళ్లి హడావిడి చేస్తున్న ఇదే టైంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. దీపావళి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో అంటున్నారు. ఈ అంశంపై పార్టీలో ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండగా..ఇంకా అభ్యర్థులను కూడా ఖరారు చేయాల్సి ఉంది. వీటన్నిటితోపాటు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్రమంత్రులకే ఫిర్యాదులు కూడా చేశారు. ఇన్ని అంశాలు తెరమీద ఉన్న సమయంలో..రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ టూర్ కేవలం అధిష్టానం పెద్దలను కలవడానికేనని..ఈ మధ్య మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ ఆ విషయంలో ఏమైనా ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో ఉండగానే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో కీలక మలుపు తిరుగుతుందని కీలక వ్యక్తులను విచారించడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు దర్యాప్తు సంస్థలు విన్నవించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కీలకంగా కేటీఆర్ పేరే వినిపిస్తోంది. ఈ విషయంపై ఇంకా గవర్నర్ ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడం వల్ల.. ఈ అంశంపై క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లారా లేకపోతే నార్మల్ రివ్యూ ఇవ్వడానికి వెళ్లారా అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.