తెలంగాణ రాష్ట్ర గీతం రూపశిల్పి అందెశ్రీ కన్నుమూత

Famous Poet, Telangana State Song Writer Ande Sri Passed Away

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ (64) నేడు (నవంబర్ 10, 2025) హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత రాత్రి లాలాగూడలో ఉన్న తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అందెశ్రీ విశిష్టతలు:

రాష్ట్ర గీతం రూపశిల్పి: ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించారు.

ఉద్యమంలో కీలక పాత్ర: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా, ధూంధాం కార్యక్రమాల రూపశిల్పిగా అందెశ్రీ మహోన్నతమైన పాత్రను పోషించారు. ఆయన పాటలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించి, ఉద్యమానికి ఊపిరి పోశాయి.

ప్రసిద్ధ గేయాలు: ఆయన కలం నుంచి వచ్చిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే అద్భుత గీతం మానవ సంబంధాల క్షీణతను కళ్లకు కట్టి, దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది.

వ్యక్తిగత జీవితం: 1961, జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించిన అందెశ్రీ (అసలు పేరు అందె ఎల్లన్న), ఏ విధమైన పాఠశాల విద్య అభ్యసించకుండానే, అశువు కవిత్వం చెప్పడంలో, లోతైన సాహిత్యం సృష్టించడంలో దిట్టగా పేరు పొందారు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

పురస్కారాలు: అందెశ్రీ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. 2006లో ‘గంగ’ సినిమాకు నంది అవార్డు గెలుచుకున్న ఆయన, 2014లో అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. అలాగే, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కరం, లోక్‌నాయక్‌ పురస్కారం వంటివి కైవసం చేసుకున్నారు.

అందెశ్రీ మృతి పట్ల పలువురు రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here