లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ,ఈడి కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. తనకు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్ కు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈడీ చేయలేదు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు.
శుక్రవారంలోగా కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. కవిత పిటిషన్పై వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న తరుణంలో కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు ఆశతో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఢిల్లీకి వెళ్లారు.
ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం కోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేయడంతో మరోసారి కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు ఐదు నెలలుగా కవిత జైలులోనే ఉన్నారు. పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మరి కవిత బెయిల్ పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.