హైదరాబాద్ మహానగరంలో గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుతున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితికి వివిధ మండపాల్లో కొలువైన బొజ్జగణపయ్య ఘనమైన పూజలు అందుకుంటున్నాడు. భాగ్యనగరంలోని అత్యంత భారీ వినాయకుడు ఖైరతాబాద్ గణనాధుడని ఆశీస్సుల కోసం భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు.
గణపతి నవరాత్రుల్లో మూడు రోజులు పూర్తవడంతో చాలా చోట్ల గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చిన్న గణపయ్యలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి.వినాయక చవితికి మరుసటి రోజు నుంచే హైదరాబాద్లోని పలు చెరువుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే, నేటి నుంచి జోరుగా నిమజ్జనాలు కొనసాగనున్నాయి.
మరోవైపు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ రోజు నుంచి సెప్టెంబర్ 16వ తేదీవరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు సిటీ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సెయిలింగ్ క్లబ్ టీ జంక్షన్ నుంచి కర్బలామైదాన్ వచ్చే సాధారణ ట్రాఫిక్ను.. అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు.
అటు నుంచి ప్రయాణించే వాహనదారులంతా కవాడిగూడ వైపు టర్న్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వాహనదారులు ముందే ట్రాఫిక్ ఆంక్షలు గురించి తెలుసుకుని దాని ప్రకారం ప్రయాణించవలసిందిగా పోలీసులు కోరారు.