దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బతుకమ్మ, దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని నగర శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించింది. 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నిర్ణయం తీసుకుంది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది.
బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులతో వర్చువల్ గా చర్చించారు. ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున.. 9, 10, 11 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక బస్సులను పెంచుతామని వివరించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల బాగా పని చేస్తున్నారన సజ్జనార్ అన్నారు.
గతేడాదితో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. రద్దీ రోజుల్లో ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.