ఫిబ్రవరి 22న జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికుల కోసం.. 15వ రోజు కూడా రెస్క్యూ బృందం తన ఆపరేషన్ డీ ని కొనసాగిస్తూ వస్తోంది. కేరళ నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాడవర్ డాగ్స్ సాయంతో టన్నెల్ చివరి భాగంలో రెండు కీలక ప్రాంతాలును గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఆ ప్రాంతాలను ధ్రువీకరించడంతో అక్కడ నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అక్కడే కార్మికుల ఆచూకీ ఉండే అవకాశం ఉందని రెస్క్యూ టీమ్ అనుమానిస్తోంది.
దీంతో 15వ రోజు కూడా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో.. గల్లంతైన వారి ఆచూకీ విషయంలో టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని రెండు స్పాట్స్ కీలకంగా మారాయి. ఇదివరకే రెండు స్పాట్స్ ను రెస్క్యూ బృందాలు గుర్తించి, తవ్వకాలు చేస్తుండగా.. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్ స్క్వాడ్ కూడా శుక్రవారం అవే స్పాట్స్ ను గుర్తించాయి. దీంతో ఆ రెండు చోట్లా తవ్వకాలు సంక్లిష్టంగా మారాయి. ఆప్రాంతంలో భారీగా నీరు ఊరుతుండడంతో మూడు పంప్ లతో నీటిని బయటకు పంపుతున్నారు.
ఎండ్ పాయింట్ దగ్గరలో TBM మిషన్ ముందు భాగం.. శకలాలతో పూర్తిగా బురదలో కూరుకుపోవడంతో..ఆ మిషన్ కింద కంపార్ట్ మెంట్లో కార్మికుల ఆచూకీ ఉండొచ్చని రెస్క్యూ బృందాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టన్నెల్లో విరిగిపోయిన TBM మిషన్ శకలాలను కూడా వేగంగా బయటికి తీస్తున్నారు. అయితే ప్రస్తుతం టన్నెల్లో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో భరించలేనంతగా దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.