తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన కాంగ్రెస్లోకి చేరారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్,కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై నాలుగు వారాల్లో అనర్హత వేటు వేయాలని, లేకపోతే తామే సుమోటోగా తీసుకొని ఆ ఎమ్మెల్యేలపై వేటు వేస్తామని అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పునిచ్చింది.
అయితే హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్పుపై.. అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు లేదని ఏజీ వాదించగా ఈ కేసుపై న్యాయమూర్తి విచారణను మరోసారి వాయిదా వేశారు.