కరోనా వ్యాక్సిన్ పంపిణి సన్నద్ధతపై సోమవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, జనవరి 16 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అత్యవసర వినియోగం కోసం అనుమతివ్వబడిన రెండు కరోనా వ్యాక్సిన్లు భారతదేశంలో తయారు చేయబడటం గర్వించదగ్గ విషయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోల్చితే ఈ రెండు వ్యాక్సిన్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవని అన్నారు.
3 కోట్ల ఆరోగ్య, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసే ఖర్చు కేంద్రమే భరిస్తుంది:
ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3 కోట్ల హెల్త్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందించబడుతుందని తెలిపారు. మొదటి దశలో ఈ 3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చును కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండవ దశలో 50 ఏళ్లు పైబడిన వారు మరియు 50 ఏళ్లలోపు అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్టు తెలిపారు.
రాబోయే కొద్ది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం:
అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం అమలు చేయడంలో యంత్రాంగం సమర్ధత తెలుసుకునేందుకు ఇప్పటికే రెండు విడతలుగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం)ను కూడా నిర్వహించామని ప్రధాని అన్నారు. ప్రపంచంలో ఇతర దేశాలు భారత్ ను అనుసరించబోతున్నందున దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎంతో ముఖ్యమైనదని ప్రధాని చెప్పారు. గత 3-4 వారాల నుండి సుమారు 50 దేశాలలో కోవిడ్ -19 కు వ్యాక్సిన్ వేస్తున్నారని, అయితే ఇప్పటి వరకు కేవలం 2.5 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారని అన్నారు. రాబోయే కొద్ది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ