హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్ లో శనివారం నాడు నదుల పరిరక్షణపై జాతీయస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుండగా, అన్ని రాష్ట్రాల నుండి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసిందని, నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నదులను ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యర్ధాలతో నిండి పోతున్నాయి. నదుల సంరక్షణ లేక కలుషితం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణ, సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు.
నదులు కలుషితం కాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు: మంత్రి నిరంజన్ రెడ్డి
“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను సజీవం చేసింది. అందుకు సాక్ష్యం గోదావరి నది. 200 కిలోమీటర్ల మేర కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నది నేడు సజీవంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను కలుషితం కాకుండా చర్యలు చేపడుతున్నది. అందుకు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతోంది. ఒక్కో గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ ను ప్రభుత్వం అందించింది. గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీలను పెంచుతున్నాం. దేశంలో ఎక్కడ కూడా గ్రామానికి ఒక నర్సరీ లేదు. తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడ కూడా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ లు లేవు. వీటి ద్వారా పచ్చదనం ఒక్కటే పెరగడం కాదు నదులు కలుషితం కూడా కాకుండా కాపాడగలుగుతున్నాం. 8 సంవత్సరాల కాలంలో 3 శాతం పచ్చదనాన్ని పెంచినం అంటే తెలంగాణ ఎంత ముందుచూపుతో వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు.
“పచ్చదనం, నీటి సరఫరాతో పాటు కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్ట్. దీన్ని 3 సంవత్సరాల రికార్డ్ సమయంలో నిర్మాణం చేపట్టాం. ప్రాజెక్టుల నిర్మాణం చేయడంతో రాష్ట్రంలో వలసలు పూర్తిగా తగ్గాయి. నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పండిస్తున్న పంటలు ఎక్కువ కావడంతో కేంద్రం కొనం అని చేతులు ఎత్తేసింది. వలసలను పూర్తిగా అరికట్ట కలిగాం. నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ఎన్జీవోలు ఇతర సంస్థలు కూడా పాటు పడాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ