మే నెలలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించలేదని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలను ప్రత్యేక పరిస్థితులలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
పరీక్షల నిర్వహణ సందర్భంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అలాగే మే నెలలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు సమస్యలు రాకుండా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. మరోవైపు పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాసే ముందు ఎవరైనా ఆందోళనకు గురైతే అలాంటి విద్యార్థులకు అక్కడే మాట్లాడి మానసిక ధైర్యం కల్పించే విధంగా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో హైదరాబాద్ లో ముగ్గురు మానసిక వైద్య నిపుణులను ఏర్పాటుచేసి టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆందోళన చెందే విద్యార్థులతో టోల్ ఫ్రీ నెంబర్ 1800-5999333 నెంబరుకు పోన్ చేయించి మాట్లాడించాలని చెప్పారు. ఈ నెంబరు ప్రతి పరీక్ష సెంటర్, ప్రిన్సిపాల్ వద్ద ఉండే విధంగా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ