అమెరికాలో జూలైలో జరుగనున్న తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ‘ఆటా’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధుల బృందం నిన్న సీఎం జగన్తో ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 17వ ఆటా తెలుగు మహాసభలు జరగనున్నాయని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని వారు సీఎం జగన్ను కోరారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈవెంట్ను నిర్వహించలేకపోయామని, ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ సారి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు వెల్లడించారు.
ఈ సదస్సుకు 10 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని ఆటో ప్రెసిడెంట్ భువనేష్ భుజాల తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు 65 కమిటీలను కూడా ఏర్పాటు చేశామని వారు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ కమిటీలలో వివిధ హోదాలలో పనిచేసేందుకు దాదాపు 350 మంది సభ్యులు ఎన్నికయ్యారని వెల్లడించారు. ఆటా తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ఈ సభ్యులంతా కృషి చేస్తారని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన వారిలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల, అడ్వైజరీ కమిటీ చైర్మన్ జయంత్ చల్లా, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద్ రెడ్డి లింగాల, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సన్నీ రెడ్డి తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ