వైఎస్ఆర్ కాపు నేస్తం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది 15 వేల చొప్పున రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న కాపు మహిళలను మాత్రమే వైఎస్ఆర్ కాపు నేస్తం కింద అర్హులుగా గుర్తించనున్నారు. ఈ పథకం అమలుకోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1101 కోట్లను కేటాయించింది.
వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ధిదారుల ఎంపిక కోసం నిబంధనలు:
- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు కాపు మహిళలు మాత్రమే అర్హులు
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఉండాలి
- మూడెకరాల మాగాణి లేదా పదెకరాల మెట్ట భూమి ఉండాలి, లేదా మాగాణి, మెట్ట కలిపి పది ఎకరాలు ఉండొచ్చు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు
- కుటుంబంలో నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు
- కుటుంబసభ్యుల్లో ఎవరూ ఆదాయ పన్ను చెల్లించి ఉండకూడదు
- పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు స్థలం ఉన్నా కూడా అర్హులే
- 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలుకు వయసును ధ్రువీకరించే జనన ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ కార్డు గానీ కలిగి ఉండాలి.
[subscribe]