ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై జనవరి 27, సోమవారం నాడు విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, దీనివల్ల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు 10 రోజులు గడువు కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోరారు. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ, ఆంగ్ల మాధ్యమంలో పాఠ్య పుస్తకాల ముద్రణ, ఇతర విషయాల్లో ముందుకెళితే సంబంధిత అధికారులే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
[subscribe]