భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీ దేవస్థానమ్స్ (తిరుమల తిరుపతి దేవస్థానమ్స్) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భక్తుల కోసం ఇప్పటి వరకు గోవింద మొబైల్ యాప్ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి టీటీ దేవస్థానమ్స్ పేరుతో నూతన యాప్ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుండి అందించవచ్చని చెప్పారు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ నుంచి చూడవచ్చని తెలిపారు.
తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్ను రూపొందించినట్టు చెప్పారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని సేవలను పొందుపరుస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి మాట్లాడుతూ, భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్ గేట్ వేగా ఈ యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. భక్తులు లాగిన్ అయ్యేందుకు యూజర్ నేమ్తోపాటు ఓటిపి ఎంటర్ చేస్తే చాలని, పాస్వర్డ్ అవసరం లేదనన్నారు. కంప్యూటర్ వాడడం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్ను రూపొందించినట్టు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE