తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు భారత రాష్ట్రసమితి పార్టీ (బీఆర్ఎస్) తమ అభ్యర్థుల పేర్లను మంగళవారం నాడు వెల్లడించింది. రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ ముగ్గురుని మార్చి 9, గురువారం నామినేషన్స్ దాఖలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ నేత, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, వుల్లోల గంగాధర్ గౌడ్, కె.నవీన్కుమార్ ల యొక్క పదవీ కాలం 2023, మార్చి 29వ తేదీతో ముగియనుంది. సభ్యుల పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మూడు స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కాగా, అభ్యర్థులు నామినేషన్స్ దాఖలుకు ఆఖరితేదీ మార్చి 13గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన మార్చి 14న చేపట్టనుండగా, ఉపసంహరణకు మార్చి 16 వరకు అవకాశమిచ్చారు. ఇక మార్చి 23వ తేదీన ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE