
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కష్టాలు ఇంకా తీరేటట్లు కనిపించడం లేదు.కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్పై విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు . దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించింది.అనంతరం సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. వాయిదా వేస్తున్న విషయాన్ని తెలిపిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా..జులై 18వ తేదీ వరకు కస్టడీలోనే ఉండాలని ఆదేశించారు.
మార్చి 16న కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు విచారణ పేరుతో వెంటనే ఆమెను రిమాండుకు తరలించారు.అరెస్ట్ చేసి 100 రోజులు దాటినా కూడా కవితకు బెయిల్ విషయంలో ఇబ్బందులు తప్పడంలేదు. ఈడీ కేసుతో పాటూ సీబీఐ కూడా ఇందులో జోక్యం చేసుకుని.. చార్జ్ షీట్లో కవిత పేరును పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత తరఫు న్యాయవాది నితీశ్ రాణా విచారణ సమయంలో ..సీబీఐ ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన సీబీఐ తరఫు న్యాయవాది.. ఛార్జిషీట్లో ఎటువంటి తప్పులు లేవని స్పష్టం చేశారు.అలాగే ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ వాదించారు.
మరోవైపు చార్జ్షీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అంటూ కవిత తరపున లాయర్ ను జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్షీట్లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని అన్నారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని నితీష్ రాణా తెలిపారు. చార్జ్షీట్ పూర్తిగా లేదని తాము వాదించడం లేదన్న కవిత లాయర్..అది తప్పుగా ఉందని మాత్రమే చెబుతునట్లు పేర్కొన్నారు. దీనికి సమాధానమిచ్చిన సీబీఐ.. తాము సరైన పద్దతిలో చార్జ్షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. దీంతో 60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్షీట్ దాఖలు చేయడం అంటే.. కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేనని కవిత న్యాయవాది వాదించారు.
కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కూడా జూలై 22న విచారణ జరువుతామని ధర్మాసనం తెలిపింది. దీంతో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయి 119 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నకల్వకుంట్ల కవితకు జులై 18 వరకూ కస్టడీ పొడిగిస్తూ తాజాగా కోర్టు ఉత్తర్వులు వెలువరించింది . దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై ఇప్పట్లో స్పష్టమైన ఆదేశాలు వెలువడే పరిస్థితులు ఉన్నట్లు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.దీని ప్రకారం కవిత మరిన్ని రోజులు జైలులోనే గడపాల్సి రావచ్చన్న ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY