పదేళ్ల తరువాత ఇండియా కూటమి తరఫున ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీకి సాంతంత్ర దినోత్సవం వేడుకల్లో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదాని మోడీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ప్రోటోకాల్ నిబంధన ఉల్లంఘన జరిగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం మాత్రం ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా ఎక్కడో వెనుక సీటు కేటాయించింది.వాస్తవానికి ప్రధాని తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కలిగిన రాహుల్ గాంధీని మంత్రులతో సమానంగా సీటు కేటాయించాల్సి ఉండగా.. రెండో వరుసలో ఇచ్చారు. తొలి వరుసలో మాత్రం కేంద్రమంత్రులతో పాటు ఒలింపిక్ పతక విజేతలు కొందరు కూర్చొన్నారు.
రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీటు కేటాయించడంతో ఒలింపిక్ క్రీడాకారులతో కలిసి రాహుల్ గాంధీ కూర్చొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పలువురు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నారు. ముందు వరుసలలో మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ వంటి ఒలింపిక్ పతక విజేతలు ఉన్నారు. ఒలింపిక్-కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, పిఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ గాంధీ కంటే ముందు కూర్చున్నారు.
కాగా ఎంపీ రాహుల్గాంధీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసరమైనన్ని స్థానాలను ప్రతిపక్ష పార్టీలేవీ సాధించలేకపోయాయి. ఫలితంగా 2004 నుంచి 2024 వరకు ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను దక్కించుకోవడంతో లోక్సభలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. దీంతో జూన్ 25న ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అదే హోదాలో నేడు స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు.