బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్ రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య బంగ్లాను భారత్ 324 పరుగులకే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటారు. అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 3, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో భారత జట్టు 188 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోర్ 272/6తో ఐదో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా జట్టు మరో 52 పరుగులు మాత్రమే జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హాసన్ 84 పరుగులు చేశాడు. కాగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ జకీర్ హాసన్ అరంగేట్ర మ్యాచ్ లోనే శతకం (100) చేయగా.. మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ హాఫ్ సెంచరీ (67) చేయడం తెలిసిందే.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 404 పరుగుల భారీ స్కోర్ చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పుజారా అనంతరం బంగ్లాదేశ్ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా, భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఇన్సింగ్స్ను డిక్లేర్ చేసింది. టీమిండియా ఆటగాళ్లు శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారాలు సెంచరీలు చేయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ రెండో ఇన్నింగ్స్లో మరో 3 వికెట్లతో మొత్తం 8 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. అయితే గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్కు దూరం కావడంతో.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ టీమిండియాకు సారథ్యం వహించాడు. ఇక, టెస్టు సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22న జరుగనుంది.
స్కోరుబోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 404; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150.
భారత్ రెండో ఇన్నింగ్స్: 258/2 డిక్లేర్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 324.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ