పెద్ద సిటీ అయినా చిన్న సిటీ అయినా సినిమాలకు సంబంధించి ఒక అడ్డా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్కు అడ్డాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిలిచేవి. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే లెక్కకు మించి కనిపించే సినిమా థియేటర్స్ గుర్తొచ్చేవి .
అంతేకాదు ఇక్కడ ఫలానా థియేటర్ ఫలానా హీరోకు సెంటిమెంట్ అంటూ వార్తలు కూడా వినిపించేవి. సుదర్శన్ అంటే కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కు సెంటిమెంట్. సంధ్య థియేటర్స్ మెగా స్టార్ కు సెంటిమెంట్. ఈ క్రాస్ లో సంధ్య 35 ఎమ్ఎమ్, సంధ్య 70ఎమ్ఎమ్, దేవి, మయూరి, ఓడియన్, ఓడియన్ మినీ,సప్తగిరి, సుదర్శన్, ఉషా మయూరితో పాటు చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల లోపే సుమారు 15 వరకూ థియేటర్స్ ఉండేవి. అయినా అన్నిటికి సెంటర్ పాయింట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్.
ఇప్పుడు బడా స్టార్స్ నుంచి చోటా స్టార్స్ వరకూ అంతా ఐమాక్స్ కు వెళుతున్నారు. కానీ ఒకప్పుడయితే ఆడియన్స్ ను మీట్ అవడం అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో తమ సినిమాలు ప్లే అయ్యే థియేటర్స్కు వెళ్లి వచ్చేవారు. అయితే కొంతమంది హీరోలు ఇప్పటికీ ఇది ఫాలో అవుతున్నారు. అలాంటి థియేటర్స్ అన్నీ ఇప్పుడు మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత కాస్త కళ తగ్గాయన్న వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రస్తుతం ఐదు థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. అయితే వీటిలో సుదర్శన్ థియేటర్స్ త్వరలోనే మల్టీ ప్లెక్స్ లుగా మారబోతున్నాయన్న వార్త వినిపిస్తోంది. అటు ఓడియన్ ను ఎప్పుడో కూల్చేశారు. ఇప్పటికే అక్కడా మల్టీ ప్లెక్స్ రెడీ అవుతోంది. ఇక సప్తగిరి థియేటర్ అయితే చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో అందరి దృష్టీ ఇప్పుడు సంధ్య థియేటర్స్ పైనే పడుతోంది.
సంధ్య థియేటర్స్ ఇప్పుడు రెండు ఉన్నాయి. ఈ థియేటర్ కాస్త ఇరుకుగానే కనిపిస్తుంది. ఒకప్పుడు ఏమో కానీ.. మెట్రోవచ్చాక ఈ థియేటర్ మరీ ఇరుకుగా మారిపోయింది.అలా అని ఇక్కడ మల్టీ ప్లెక్స్ కడతారా అంటే అంత స్పేస్ అక్కడ ఉండదు. పోనీ ఇప్పటిలాగే సింగిల్ స్క్రీన్స్ గా ఉండాలంటే.. చట్టూ మల్టీ ప్లెక్స్ లు వచ్చిన తర్వాత కూడా ఈ సింగిల్ స్క్రీన్స్ వైపు జనాలు వస్తారా అన్నది అనుమానమే. మరి ఈ సంధ్య థియేటర్స్ సంగతి ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.