బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే..ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తొలిరోజు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. మిగిలిన రోజుల్లో మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద సంఖ్యలో జనం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి క్యూ కట్టారు.
కాగా మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్లోని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆమె జీతం రూ.15 వేలు కాగా, జీతంలో కోత పెట్టి ఏజెన్సీ రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో ఆమె ప్రజాభవన్కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ మరుసటి రోజు రేణుకను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం ప్రజాభవన్కు వచ్చిన ఆవేవన వ్యక్తం చేశారు. తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కోరారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. జీతాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేణుకను ఉద్యోగంలో నుంచి తీసివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ను డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలపని వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు. ఇది ప్రజల పాలన కాదని.. ప్రతీకార పాలన అని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాభవన్ కు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ మండిపడ్డారు. ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువగా ఉందని విమర్శించారు. . ప్రజావాణి దరఖాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.