తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే నా లక్ష్యం.. అందుకే పార్టీ పెట్టాను.. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తాను.. పార్టీని అధికారంలోకి తెస్తాను.. తొలినాళ్ల లో వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన కామెంట్.. ఆ తర్వాత కాంగ్రెస్ తో దోస్తీకి తెగ ప్రయత్నాలు చేశారు. పొత్తు కోసం ఆరాటపడ్డారు. దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొట్టారు. పొత్తు పొసగలేదు. అనుకున్నది జరగలేదు. దీంతో షర్మిల ఓ నిర్ణయానికి వచ్చారు.. అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి.. మనం అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు షర్మిల పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు వైఎస్ ఆర్ టీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. దీంతో షర్మిల పోటీలో ఉన్నట్లే అని అందరూ భావించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్న వైఎస్ఆర్టీపీ ప్రధానంగా 50 నియోజకవర్గాల పై దృష్టి పెడుతున్నట్లు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. పాలేరు సహా ఎంపిక చేసిన 50 నియోజకవర్గాల్లో రోడ్షోలు, సభల నిర్వహణకు పార్టీ అధినేత్రి షర్మిల ప్రణాళికలూ రూపొందించినట్లు పార్టీలో హడావిడి కనిపించింది. ఈ నెల 6న పాలేరు స్థానానికి షర్మిల నామినేషన్ దాఖలు చేయడానిక ముహూర్తమూ ఫిక్స్ చేశారు. వైఎస్ విజయలక్ష్మి పూర్తిగా పాలేరుకే పరిమితమై షర్మిల తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా ప్రచారం జరిగింది. మరోవైపు తన భర్త, బ్రదర్ అనిల్ కుమార్ను సికింద్రాబాద్కు బదులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలో దించాలని షర్మిల ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనానికి చర్చలు జరిగినప్పుడు రేవంత్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో కొడంగల్లో క్రిస్టియన్ ఓట్లను చీల్చి రేవంత్రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషణులు జరిగాయి.
సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు షర్మిల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జై కాంగ్రెస్ అన్నారు.. అందరినీ జై.. జైజై కాంగ్రెస్ అంటున్నారు. అవును షర్మిల తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, కాంగ్రెస్ అంటే తమకు ఆది నుంచీ అపార గౌరవం ఉందని చెప్పుకొస్తున్నారు. దీంతో వైఎస్ ఆర్టీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు ఇలా చేశారేంటి అన్న చర్చ జరుగతోంది. అయితే.. షర్మిల ఏ ఉద్దేశానికీ నిర్ణయం తీసుకున్నారనేది ఆసక్తిగా మారింది.
రాజన్న కుమార్తెగా తెలంగాణ రాజకీయ రణరంగంలో అడుగుపెట్టి.. అనూహ్యంగా వెనుదిరగడం అనేది ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజకీయంగా షర్మిల తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల మాత్రం పోటీ నుంచి తప్పుకోవడాన్ని సమర్థించుకుంటున్నారు. లక్ష్యానికి అనుగుణంగా కేసీఆర్ సర్కారు అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుందో.. మున్ముందు ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకుంటారో.. వైఎస్ ఆర్ టీపీ జెండా ఎత్తేస్తారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE