టోల్ ఫీజుల వసూళ్లకు సంబంధించి వాహనదారులకు మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల రుసుము నిబంధనలను మంగళవారం సవరించింది.దీనిలో శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసే విధానాన్ని చేర్చుతూ.. దీనిపై ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ప్రైవేటు వాహనదారులకు ప్రయోజనం కల్పిస్తూ దీనిపై జాతీయ రహదారుల ఫీజుల నిబంధనలు2008ను సవరించింది. జీఎన్ఎస్ఎస్ సౌలభ్యం ఉన్న వాహనదారులకు ఆ మేరకు ప్రయోజనం చేకూర్చేలా జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు 2024ను కొత్తగా అప్డేట్ చేశామని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో వివరించింది.
వాహనానికి జీఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సౌలభ్యం కలిగిన వాహనదారులు హైవేలు, ఎక్స్ప్రెస్ వేలపై రోజుకు 20 కి.మీటర్ల దూరం ఎలాంటి టోల్ ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించవచ్చని నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రయాణం 20 కి.మీటర్లకు మించితే మొత్తం ప్రయాణించిన దూరానికి టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది.
నేషనల్ పర్మిట్ ఉన్న వెహికల్స్ తప్ప ఇతర వాహనాలు ఒక రోజులో జాతీయ రహదారులు, బైపాస్ లేదా సొరంగం గుండా ప్రయాణిస్తే..వెహికల్ డ్రైవర్ లేదా యజమాని ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని దిశల్లో కూడా 20 కి.మీటర్ల ప్రయాణ దూరం మినహాయింపుగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
కాగా ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ విధానంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ గా.. జీఎస్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టులుగా రెండు చోట్ల పరీక్షించిన తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.