కోల్కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్లో జూనియర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచిన ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. దీంతో ఆర్జీకర్ లోని వైద్యసిబ్బంది మరోసారి నిరసన చేపట్టారు. ఈ కేసులో CBI చార్జీషీట్ను దాఖలు చేసినప్పటికీ, దోషులకు శిక్ష పడలేదని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బుధవారం, WBJDF మరో నిరసన కార్యక్రమం నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నుండి సీజీ ఓ కాంప్లెక్స్ వరకు టార్చ్ మార్చ్ నిర్వహించారు.
కాగా నేడు పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ (WBJDF) CBIకి కఠినమైన ప్రశ్నలు సంధిస్తూ, న్యాయం కోసం శనివారం నవంబర్ 9న మధ్యాహ్నం 3 గంటలకు కాలేజ్ చౌరస్తా నుంచి ధర్మతాళ్ల వరకు పాదయాత్ర నిర్వహించేందుకు పిలుపునిచ్చింది.
జూనియర్ డాక్టర్ల ప్రశ్నలు
శవపరీక్ష కోసం శాంపిల్ తీసుకున్నప్పటికీ, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు 14వ తేదీన పంపడమేంటీ? దీనికి ఎందుకు ఆలస్యం అయింది?
సంజయ్ రాయ్ను 9వ తేదీ రాత్రి అరెస్టు చేసినప్పటికీ, ఆమె రక్తపు మరకలు 12వ తేదీన బ్యారక్ నుండి తీసుకోవడం ఏంటీ? దీనికి కూడా ఆలస్యం ఎందుకు?
చార్జీషీట్ ప్రకారం, సంజయ్ రాయ్ ఆర్జి కార్ ఆసుపత్రిలో 3:20 AM కి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. కానీ, అతను 3:34 AM లో ట్రామా కేర్ బిల్డింగ్ కు వెళ్లాడు. మరి 3:36 AM లో ఏం జరిగిందో?
సంజయ్ రాయ్ నాలుగో అంతస్తులో అరగంట పాటు ఉన్నాడా? అతడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు?
పోలీస్ అధికారులు మృతదేహాన్ని దహనం చేయడానికి అత్యవసర చర్యలు తీసుకుంటున్నప్పుడు, అభయ తల్లిదండ్రులను ఎందుకు దహనం నిర్వహణ ప్రాంతానికి వెళ్లనివ్వలేదు?
ఈ ప్రశ్నలపై జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, CBI , పోలీసుల పనితీరు పై అనేక సవాళ్లను ముందుంచారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే సంజయ్ రాయ్ ను అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోంది అని అన్నారు. జూనియర్ డాక్టర్లు ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
ఆగస్టు 9న ఆరికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో నిందితుడైన పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను జైలు కస్టడీలో ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ సిబిఐపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తుతూ సివిల్ మార్కు పిలుపునిచ్చింది. న్యాయం చేయాలంటూ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాలేజ్ చౌరస్తా నుంచి ధర్మతాళ్ల వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నారు. వీరితో పాటు ఆరి కార్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించనున్నారు.