కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అమలు, అనుకూలతలకు సంబంధించి కొన్ని కార్పోరేట్ కంపెనీలపై గతకొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోమవారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి జరుగుతుందని వస్తున్న వార్తలను ఖండించింది. కాంట్రాక్ట్ లేదా కార్పోరేట్ ఫార్మింగ్ బిజినెస్ లోకి ప్రవేశించే ఆలోచన లేదని రిలయన్స్ పేర్కొంది.
అందుకు సంబంధించి ఎలాంటి భూములు కొనుగోలు చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రణాళికలు లేవని ప్రకటనలో వెల్లడించారు. రైతులు పండిస్తున్న పంటలకు మంచి ధర వచ్చేలా రిలయన్స్, మరియు రిలయన్స్ అనుబంధ సంస్థలు ఎప్పుడూ మద్దతు ఇస్తాయని తెలిపారు. నేరుగా రైతుల నుంచి ఎప్పుడూ ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేదని, తమకు సరఫరా చేసేవారు రైతుల నుంచి కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఎప్పుడూ కట్టుబడి కొనుగోలు చేయాలని తమ సరఫదారులకు సూచిస్తామని రిలయన్స్ సంస్థ వెల్లడించింది.
మరోవైపు తమ సంస్థల కమ్యూనికేషన్ టవర్ల ధ్వంసంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ పంజాబ్, హర్యానా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధమైన ఈ విధ్వంస చర్యలకు పూర్తిగా ఆపేందుకు ప్రభుత్వ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని పిటిషన్ లో కోరారు. ఈ చర్యలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా, సమాచారరంగ మౌలిక సదుపాయాలకు నష్టం, అంతరాయాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ విధ్వంసానికి పాల్పడుతున్న వ్యక్తులు తమ వ్యాపార ప్రత్యర్థులచే ప్రేరేపించబడ్డారని రిలయన్స్ సంస్థ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ