మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయాన్ని సాధించడంతో..ఇక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం పీఠం దక్కింది. మహాయుతి కూటమి సూపర్ విక్టరీ సాధించి.. వారం దాటినా మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు.
కాగా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబరు 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమయింది. శివసేన నాయకులు ఏక్నాథ్ షిండే సీఎం కావాలని కోరుకున్నా.. బీజేపీ మాత్రం ఫడ్నవీస్ వైపే మొగ్గింది. మహారాష్ట్ర ఎన్నికలలో..288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాలను మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలు గెల్చుకోగా.. శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లోనూ గెలుపొందాయి.
అయితే ముఖ్యమంత్రి పేరు ఖరారు కావడంతో..డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్ను ఎన్నుకోనున్నట్టుగా దీనికి ఏక్ నాథ్ షిండే కూడా మద్దతు ఇచ్చినట్టుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు మహాయుతి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే..ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలలో మరో పేరు తెరపైకి వచ్చింది. ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అజిత్ పవార్ ఎన్సీపీ నేతలు ఈ నిర్ణయాల విషయంలో సందిగ్ధంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.