తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తాజాగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ నిర్ణయం వెలువడింది. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు ఉభయ సభల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చి ఇకపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా గుర్తించాలని ఆ పార్టీ ఎంపీలు పలువురు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు దీనికి సంబంధించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రాసిన లేఖను రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లను వారి ఛాంబర్లలో ప్రత్యేకంగా కలుసుకుని అందజేశారు.
ఇక ఛైర్మన్, స్పీకర్లను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, మరియు ఇతర లోక్సభ సభ్యులు ఉన్నారు. కాగా తాము చేసిన విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వెంటనే స్పందించారని, పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్గా మార్చాలని అధికారులను ఆదేశించారని వారు తెలిపారు. అలాగే లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని, పార్టీ పేరు మార్పును త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ