ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు యాషెస్ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తోలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 251 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది, లంచ్ తరువాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయి 146 పరుగులకే ఆలౌట్ అయింది. నాథన్ లియాన్ దాటికి ఇంగ్లాండ్ ఏ దశలో కోలుకోలేకపోయింది, నాథన్ లియాన్ 6 వికెట్స్ తీయగా, పాట్ కమ్మిన్స్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టులో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ టెస్టులో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తోలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేసింది. ఈ తోలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ 144 పరుగులు తో ఒంటరి పోరాటం చేసాడు. తరువాత తోలి ఇన్నింగ్స్ ఆడినా ఇంగ్లాండ్ జట్టు 374 పరుగులకు ఆలౌట్ అయింది. రోరి బర్న్స్ 133 పరుగులు చేయగా, స్టోక్స్ (50), రూట్ (57) పరుగులు చేసారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.ఈ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ (142), మాథ్యూ వాడే (110) పరుగులతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్ లో 146 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్ లో స్టోక్స్ ని అవుట్ చేయడం ద్వారా నాథన్ లియాన్ టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఈ నెల 14 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభమవుతుంది.