తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ ఉమ్మడి ఏపీలో జారీ చేసిన రేషన్కార్డులే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొత్త కార్డులు జారీ చేశారు కానీ రాష్ట్రవ్యాప్తంగా చేయలేదు. తెలంగాణలో ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్త కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. 2025, జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డులకు సంబంధించిన ఇప్పటికే అందిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు.. లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
కాగా..రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 13వ తేదీన గైడ్లైన్స్ విడుదల చేసింది. రేషన్ కార్డుల జారీపై క్యాబినెట్ సబ్కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగానే ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా కులగణన సర్వే ఆధారంగా రేషన్కార్డు లేని కుటుంబాల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు.
మండలస్థాయిలో అయితే ఎంపీడీవో, పట్టణస్థాయిలో అయితే మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. అదే జిల్లాస్థాయిలో అయితే అదనపు కలెక్టర్లు, డీసీఎస్వోలు పర్యవేక్షిస్తారు. రేషన్కార్డుల దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాను గ్రామసభలో చదివి వినిపించి.. అక్కడే ఆ జాబితాపై చర్చించి ఆమోదిస్తారు.
అలా గ్రామసభ లేదా వార్డు సభలో ఆమోదించిన జాబితాను మండల, మున్సిపల్ అధికారులు కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపిస్తారు. ఈ జాబితాపై కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ తుది నిర్ణయాన్ని తీసుకుని..ఆ తర్వాత కార్డులు జారీ చేస్తారు. అలాగే రేషన్కార్డులో పేర్ల మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికోసం సభ్యుల పేర్లకు సంబంధించి ఆధార్ కార్డులు, మ్యారేజీ సర్టిఫికెట్లను అధికారులకు అందించాలి.
అంతేకాదు సంబంధిత సభ్యుల బర్త్ సర్టిఫికెట్లతో పాటు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన సమయంలోనే రేషన్కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే అప్పట్లో దరఖాస్తు చేయనివారు ఇప్పుడు మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్కార్డును ఏడాదికి కుటంబానికి వచ్చే ఆదాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో అయితే ఏడాది 1.50 లక్షల రూపాయల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డు జారీ చేస్తారు.