రూ.12,200 కోట్ల ధాన్యం కొనుగోళ్లు, 24 గంటల్లోనే డబ్బులు జమ – మంత్రి మనోహర్

AP Minister Nadendla Manohar Pledges Paddy Payments Within 24 Hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమైన సంస్కరణలు చేపట్టామని, రైతుల ఆర్థిక భారం తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, దళారులను ప్రోత్సహించే పరిస్థితులను మార్చి, రైతులతో మాట్లాడి పారదర్శకత పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు లక్ష్యాలు:
  • కొనుగోలు లక్ష్యం: ఈ ఖరీఫ్ మాసంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యామని మంత్రి తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 12,200 కోట్లు.
  • పారదర్శకత: తేమ శాతంలో పారదర్శకత లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, ఇకపై బ్లూ టూత్ ద్వారా మాయిశ్చర్ రీడింగ్‌ను లెక్కించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
  • అలాగే, వాట్సప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నామని, ఈ సౌలభ్యాన్ని రైతులు ఇప్పటికే వాడుతున్నారని చెప్పారు.
  • గోతాలు, విధానాలు: 6 కోట్ల గోతాలను (గన్నీ బ్యాగులు) సిద్ధం చేశామని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను (SOP) అమలు చేస్తున్నామని తెలిపారు.
24 గంటల్లో చెల్లింపులు (పేమెంట్):

గత ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో 6 నుంచి 9 నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని, దాదాపు రూ. 1670 కోట్ల బకాయిలు వదిలివెళ్లిందని మంత్రి విమర్శించారు.

  • తక్షణ చెల్లింపు: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దాదాపు 87 శాతం ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో ఇచ్చామని తెలిపారు.

కొత్త లక్ష్యం: ఈసారి 24 గంటల్లోనే పేమెంట్ చేసేలా ప్రయత్నం చేస్తున్నాం.

  • ధాన్యం అమ్మిన 2 గంటల్లోనే (ఉదయం, 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు విక్రయించినా) రోజు వారికి పేమెంట్ చేస్తామని స్పష్టం చేశారు.
  • సెలవు రోజుల్లో మాత్రం తదుపరి రోజు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.
కొనుగోలు, ఇతర పథకాల ప్రణాళిక:

నవంబర్‌లో 11 లక్షలు, డిసెంబర్‌లో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, మార్చిలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి తెలిపారు.

  • గోధుమలు, దీపం 2: జనవరి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్‌లలో గోధుమ కేజీ రూ. 18 చొప్పున అందించాలని చూస్తున్నట్లు చెప్పారు. దీపం 2 పథకం మూడో విడత నవంబర్ 30 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
  • పంట నష్టం: మోంథా తుఫాను బాధితులకు పౌరసరఫరాల శాఖ నిత్యావసరాలు అందించిందని తెలిపారు.
  • ఈ-క్రాప్: 39 లక్షల 51 వేల ఎకరాల్లో ధాన్యం కొనుగోలు ఈ క్రాప్ కింద నమోదు అయిందని, 85 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని భావిస్తున్నామన్నారు.
  • ఈ-క్రాప్‌లో నమోదు అయిన ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
  • రేషన్ కార్డులు: స్మార్ట్ కార్డ్‌ల పంపిణీ 92 శాతం పూర్తయిందని, మిగిలిన కార్డులను వెనక్కి తీసుకుని మనమిత్ర యాప్ ద్వారా కోరిన వారికి పరిశీలించి ఇస్తామని తెలిపారు.
  • ఇతర సౌకర్యాలు: కౌలు రైతులకు 50 వేల టారపాలిన్‌లు ఉచితంగా అందిస్తామని మంత్రి ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here