రాజకీయంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా .. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా 20 ఏళ్లకు పైగా పార్టీని కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒంటి చేత్తో నడిపించుకుంటూ వస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓ సాధారణ నేత.. అత్యంత సంక్లిష్టమైన నియోజకవర్గంలో పాతికేళ్లుగా ఒంటి చేత్తో పార్టీని నడిపించడం అంటే అంత ఈజీ కాదు. తానే కాకుండా ఆయన భార్య కూడా ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ అందరికీ అందుబాటులో ఉంటారు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా ఆనేతకే టికెట్ ఇచ్చేలా చంద్రబాబు మనసులో స్థానం సంపాదించుకున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత అయిన కందికుంట వెంకటప్రసాద్. . బీసీలలో చేనేత సామాజిక వర్గంలోని ఉప కులాలకు చెందినవ్యక్తి. టీడీపీ అన్నా.. ఎన్టీఆర్, చంద్రబాబు, పరిటాల రవి అన్నా ఆయనకు ఎంతో పిచ్చి. ఈ క్రమంలోనే 2004 ఎన్నికలకు ముందే కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టి.. 2004 ఎన్నికల సమయానికి అప్పట్లో పార్టీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకంగా వేవ్ ఉన్నా కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న కదిరిలో టీడీపీ గెలుస్తుందనే స్థాయికి పార్టీని పటిష్టం చేసిన ఘనత కందికుంట వెంకటప్రసాద్ది.
2004 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభంజనంలో 40,000 ఓట్లు రాగా.. ఎనిమిది వేల ఓట్ల తేడాతో కందికుంట వెంకటప్రసాద్ ఓడిపోయారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కందికుంట పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2009 ఎన్నికలలో ఇటు కాంగ్రెస్, అటు ప్రజారాజ్యం పార్టీ హవాను కూడా తట్టుకొన్నారు. 16 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన కందికుంట.. ఆ ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని భారీ మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ కందికుంట ఓడిపోయినా కూడా చంద్రబాబుకు ఆయనపై నమ్మకం అలాగే ఉండిపోయింది.
2014 ఎన్నికలలో కందికుంట కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయినా పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చింది. కదిరి లాంటి క్లిష్టమైన నియోజకవర్గంలో మరొక నేత అయితే రాజకీయాల నుంచి ఎప్పుడో బయటకు వెళ్లిపోయేవారు. కానీ పోరాట పటిమకు మారుపేరైన కందికుంట మాత్రం 20 ఏళ్లకు పైగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇటు మంగళగిరి లోకేష్కు ఎంత సంక్లిష్టమైన నియోజకవర్గమో… కదిరి కూడా టీడీపీకి అంతే సంక్లిష్టమైన నియోజకవర్గం. మంగళగిరిలో టీడీపీ 30 ఏళ్ల క్రితం అంటే 1994లో మాత్రమే గెలిచింది. లోకేష్.. చంద్రబాబు తనయుడు, మంత్రి. ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచీ కూడా అక్కడే ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ ఈ ఎన్నికలలో ఎలా అయినా గెలవాలన్న కసితో ఉన్నారు.
ఇక కదిరిలో మైనార్టీ ఓటింగ్ 70 వేల వరకు ఉండగా.. నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓటింగ్ కూడా ఎక్కువగానే ఉంది. సామాజిక సమీకరణల పరంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీకి కదిరి అనుకూలం కాదు. అలాంటి చోట మరోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్న కందికుంటపై ఓటర్ల సానుభూతి ఉందట. కదిరి కోసం కందికుంట ప్రసాద్ ఎంతో చేశారని.. ఈసారి కందికుంటను గెలిపించుకుందామన్న టాక్ నడుస్తుందట. మరి కందికుంట రెండోసారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY