దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 12, 2025) స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, బాధితుల చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలను వెంటనే అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp
— Narendra Modi (@narendramodi) November 12, 2025
ఆసుపత్రి సందర్శన: రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ వెంటనే లోక్నాయక్ జయప్రకాష్ (LNJP) ఆసుపత్రికి వెళ్లారు.
బాధితులకు పరామర్శ: ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా కలిసి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులు, అధికారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక మార్గం: ప్రధాని రాక కోసం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద మీడియా వేచి ఉండటంతో, ఆయన వెనుక వైపున్న ప్రత్యేక గేటు ద్వారా లోపలికి ప్రవేశించడం గమనార్హం.
సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశం..
ఈ పరామర్శ అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. అందులో.. “ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి, ఢిల్లీ పేలుడులో గాయపడిన వారిని కలిశాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కుట్ర వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతాం!” అని హెచ్చరించారు.
ఢిల్లీ పేలుడు దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎన్ఐఏ (NIA) దర్యాప్తు చేపట్టింది. ఈ దుశ్చర్యకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేలుడు జరిగిన వెంటనే ప్రధాని మోదీ గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే.








































