తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: మూడో విడతలోనూ కాంగ్రెస్‌ జోరు

Telangana Panchayat Polls Congress Sweeps Third Phase with Huge Margin

తెలంగాణలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ఘనంగా ముగిసింది. మూడో విడత ఫలితాల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి ‘తీన్‌మార్‌’ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 4,159 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 2,286 స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 242 చోట్ల, ఇతరులు 479 చోట్ల విజయం సాధించారు. మొత్తంగా మూడు విడతలు కలిపి చూస్తే 12,733 పంచాయతీలలో కాంగ్రెస్ 7,010 చోట్ల గెలిచి పల్లెల్లో తన పట్టును నిరూపించుకుంది.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 85.77 శాతం భారీ పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా 92.56 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, నిజామాబాద్ జిల్లా 76.45 శాతంతో అత్యల్ప పోలింగ్‌ను నమోదు చేసింది. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 22న జరగనుంది. నిజానికి 20వ తేదీన జరగాల్సి ఉన్నా, మంచి ముహూర్తం లేదని కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు కోరడంతో ప్రభుత్వం ఈ గడువును రెండు రోజులు వాయిదా వేసింది.

తెలంగాణ పల్లెల్లో కొత్త పాలన మొదలుకావడంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పోరు ముగియడంతో రాజకీయ పార్టీలన్నీ ఇక స్థానిక సంస్థల అభివృద్ధిపై దృష్టి సారించనున్నాయి. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు భారీగా పాల్గొని తమ అభీష్టాన్ని చాటుకోవడం ఒక గొప్ప శుభపరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here