తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ ఉద్యోగ నియామక పరీక్షను రద్దు చేసింది. కాగా ఈ ఏడాది జులై 17న మొత్తం 1000 పోస్టుల భర్తీకై రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు విచారణ చేపట్టారు. ఘట్కేసర్ పరిధిలోని ఓ పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్తో ఓ అభ్యర్థి పట్టుబడటంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇక విచారణలో భాగంగా సదరు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ చేసినట్లు రుజువైంది.
అలాగే ఈ రాత పరీక్షలో రాష్ట్ర విద్యుత్ సంస్థలలోని ఉద్యోగులు, మరికొందరు బయటి వ్యక్తులు కలిసి కొంత మంది అభ్యర్థుల నుంచి పరీక్ష సందర్భంగా సమాధానాలు చెబుతామని దాదాపు లక్ష రూపాయలు వరకు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ ఘటనలో కీలకంగా ఉన్న ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నాటి పరీక్షను రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే త్వరలోనే మరో పరీక్ష నిర్వహిస్తామని, దీనికోసం కొత్తగా నోటిఫికేషన్ను విడుదల చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY