ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గబాటి పురందేశ్వరి ఎంపికై రెండేళ్లు పూర్తవడంతో.. ఆమె స్థానంలో కొత్త చీఫ్ ఎంపిక అనివార్యంగా మారింది.కాగా పదవి కోసం పార్టీలో పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ నేతలు ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం..ఇటు ఏపీలోనూ కూటమి ప్రభుత్వం నడుస్తుండడంతో ఈ పదవికి విపరీతమైన పోటీ ఏర్పడింది. దీనివల్ల అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకొని అధిష్టానం ఒక నిర్ణయానికి రానుంది. అయితే ఈసారి రాయలసీమకు చెందినవారికి అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఇటు ఒక ఏడాది పాటు పురందేశ్వరి పదవి కొనసాగింపుపైన కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీకి వచ్చినపుడు పురందేశ్వరి ..ఏడాది పాటు తన పదవిని కొనసాగించాలని ప్రత్యేకించి విన్నవించినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఆమెకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని తేలిపోయింది.
అయితే ఎవరిని ఎంపిక చేయాలన్నవిషయంపై బీజేపీ అధిష్టానం వడబోత చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీలకు అయినా, రెడ్డి సామాజిక వర్గానికి అయినా బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వాలన్నది హై కమాండ్ ఉద్దేశం కావడంతో.. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూడి తిరుపతిరావు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నారు. ఇటు జీవీఎల్ నరసింహం పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించినా.. వివిధ సమీకరణల్లో ఆయనకు ఛాన్స్ దక్కకపోవడంతో ఇప్పుడు అధ్యక్ష పదవిపైన ఆశలు పెట్టుకున్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవిని ఇవ్వడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలుంటాయని హైకమాండ్ భావిస్తోంది. రాయలసీమలో పార్టీ బలోపేతం చేయడంతో పాటు రెడ్డి సామాజిక వర్గం అభిమానాన్ని కూడా చూరగొనాలని చూస్తోంది. అయితే ఆ స్థాయిలో ఉన్న నేతలను పరిశీలిస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరడంతో ఆయన విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయి.
మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి పేరు గట్టిగానే వినిపిస్తున్నా.. ఆయన టీడీపీకి వ్యతిరేకం అన్న ముద్ర ఉంది. ప్రస్తుతం ఏపీలో పొత్తు సజావుగా కొనసాగుతున్న వేళ విష్ణువర్ధన్ రెడ్డికి అధ్యక్షుడి పదవి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట.ఇలాంటి సమయంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరుని హైకమండ్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్.. రామచంద్ర రెడ్డి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని.. పైగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో హై కమాండ్ కూడా ఆయనకే ఆమోద ముద్ర వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును కొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేయడం ఒకటే మిగిలి ఉందన్న ప్రచారం జరుగుతోంది.