తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు అరుదైన గౌరవం దక్కింది. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలకు గానూ గౌరవార్ధం ఆయన పేరుతో కొత్త నాణేన్ని ముద్రించటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.100 వెండి నాణెంపై ఆయన ముఖచిత్రంతో కూడిన బొమ్మను ముద్రించనుంది. ఈ మేరకు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ‘మింట్’ అధికారులు సమాచారం అందించారు. హైదరాబాద్ లోని పురంధేశ్వరి నివాసంలో ఆమెను కలుసుకున్న మింట్ ప్రతినిధులు నాణెం నమూనాను చూపించారు. ఈ కొత్త కాయిన్ ముద్రణకు సంబంధించి ఆమెనుంచి కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించారు. కాగా ఈ రూ.100 నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేయనున్నారు. ఇక 2022 మే 28వ తేదీ నుండి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని త్వరలోనే ఈ వెండి నాణెన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక దీనిపై పురంధేశ్వరి స్పందిస్తూ.. ఎన్టీఆర్ పేరిట ఒక నాణెం ముద్రించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరడం జరిగిందని, ఆమె వ్యక్తిగతంగా తీసుకున్న చొరవ కారణంగానే నేడు ఇది కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. నాణెం ముద్రణకు మింట్ అధికారులు ఆమోదం తెలిపారని, దీనికోసం మూడు ఎన్టీఆర్ ఫోటోలను పరిశీలించారని చెప్పారు. ఇక నాణెం రూపకల్పన ప్రక్రియకు దాదాపు నెల రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత నాణేన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలియజేశారు. ఇది అదృష్టంగా మరియు గౌరవంగా భావిస్తున్నామని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE