బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన యూట్యూబర్ల లెక్కలు తేలుస్తున్నారు ఏపీ పోలీసులు. చట్టరీత్యా నేరం అయినా కూడా.. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారి లెక్క తెల్చడానికి సిద్ధమయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి
ఇంతకాలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో రెచ్చిపోయారు. ఫాలోవర్స్ పెరగడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇంతకాలం చెలరేగిపోయారు.
చట్టరీత్యా నేరం అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్..ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. అయితే.. అలాంటి వారిపై ఏపీ సర్కార్ సీరియస్ గా చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా లోకల్ బాయ్ నాని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. లోకల్ బాయ్ నాని ప్రమోషన్స్పై ఇటీవల AYIF యూత్ వింగ్ విశాఖ సీపీ శంకబత్ర బాగ్చీకి ఫిర్యాదు చేయగా..దీనిపై విచారణ చేపట్టి.. చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. నానిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించగా..ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నాని మాత్రమే కాదు.. నానిలాగే మరి కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న కొంతమంది యూట్యూబర్స్.. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ జనాలను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది. అంతేకాదు ఇప్పటికే చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లలో తీవ్రంగా నష్టపోయి సూసైడ్స్ చేసుకున్న ఘటనలున్నట్లు గుర్తించారు. దీంతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఇకపై సీరియస్గా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు..
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని గుర్తించడానికి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ లను ఎవరెవరు ప్రమోట్ చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాదు ఎవరైనా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వారివారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం జనాలను తప్పుదారి పట్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయని.. ఆన్ లైన్ బెట్టింగ్లో పాల్గొనేటట్టు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేసినట్లు గుర్తించిన వెంటనే.. అలాంటివారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.