చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

Chittoor Court Delivers Sensational Verdict in Former Mayor Couple Case

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సుమారు పదేళ్ల క్రితం, 2015, నవంబర్ 17న చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో అప్పటి మేయర్ కఠారి అనురాధ మరియు ఆమె భర్త, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కఠారి మోహన్‌లను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు దోషులకు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.

ఈ హత్య కేసులో కఠారి మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (ఏ1) ప్రధాన నిందితుడు కాగా, అతడితో పాటు గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ (ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి (ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు (ఏ4), మునిరత్నం వెంకటేష్ (ఏ5) లను దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది.

ఈ హత్యలు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల కారణంగా చింటూ ప్లాన్ చేసి, బురఖాలు ధరించిన దోషులతో తుపాకులు, కత్తులతో చేయించినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసింది. సుదీర్ఘంగా పదేళ్ల పాటు సాగిన ఈ విచారణలో మొత్తం 352 వాయిదాలు పడ్డాయి, 122 మంది సాక్షులను కోర్టు విచారించింది.

ముఖ్యంగా, నాల్గవ నిందితుడు మంజునాథ్ (ఏ4)పై హత్యాయత్నం అభియోగం కూడా రుజువైంది. కాగా, తొలుత ఈ కేసులో నిందితులుగా ఉన్న 21 మందిలో, మిగిలిన 16 మందిపై ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం వంటి ఆరోపణలు రుజువు కాకపోవడంతో న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here