మొంథా తుఫాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉంటేనే ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన మంగళవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉండి, విరామం లేకుండా వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు:
- నిరంతర పర్యవేక్షణ: ఆర్టీజీఎస్ (RTGS) నుంచి మూడు సార్లు సమీక్షలు, కలెక్టర్లు, అధికారులతో రెండు సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించిన సీఎం, తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని చెప్పారు.
- తక్షణ పరిష్కారం: గాలికి పడిపోయిన చెట్లను తక్షణమే తొలగించాలని, విద్యుత్ సబ్స్టేషన్లలో సమస్యలను రియల్ టైమ్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
- సమన్వయం, భరోసా: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదారుగురు అధికారులతో కూడిన బృందాన్ని పంపాలని, వారు గ్రామాల్లో ఉండి ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు.
- గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందే ప్రభుత్వ ప్రతినిధులని, బాధితులకు తక్షణ సాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
- ముందస్తు చర్యలు: కరెంట్ కట్ చేయాల్సి వస్తే, ముందుగానే ప్రజలకు క్యాండిళ్లు సరఫరా జరిగేలా చూడాలన్నారు. పునరావాస శిబిరాల్లో వారికి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి.
- రవాణా అంతరాయం: జాతీయ రహదారులపై రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తే, ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు.
- గత అనుభవాల దృష్ట్యా: గతంలో హుద్హుద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి నాలుగు రోజుల్లోనే ప్రజలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసి, అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు.
నష్టం అంచనా, సహాయక చర్యలపై సూచనలు
తుఫాను ప్రభావం తగ్గగానే, నష్టం అంచనా నివేదికలను శాఖలవారీగా సిద్ధం చేసుకోవాలని, ప్రాథమిక నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపాలని సీఎం ఆదేశించారు.
- విద్యుత్ పునరుద్ధరణ:తుఫాన్ ప్రభావం తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలని మంత్రి నారా లోకేశ్కు సీఎం సూచించారు.
- జల వనరులు: ఏలేశ్వరం రిజర్వాయరు, బుడమేరు తదితర వాగుల్లో ప్రవాహాలపై ఆరా తీసి, వరద నిర్వహణకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
- కోత ప్రాంతాలపై దృష్టి: కాలువలు, చెరువులు, రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్ర కాలువకు ఆకస్మిక ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలన్నారు.
- పంట నష్టం: వ్యవసాయ అధికారుల నివేదిక ప్రకారం, కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది.
- మత్స్యకారులకు సాయం: వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరామర్శ
తుఫాన్ పరిస్థితిపై కేంద్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి, సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సమీక్షల్లో పాల్గొని, రోడ్లు, విద్యుత్ స్తంభాలు పడితే తక్షణమే వాటిని తొలగించి, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షల్లో సీఎస్ విజయానంద్, మంత్రులు నారాయణ, అనిత, సత్యప్రసాద్, డీజీపీ గుప్తా పాల్గొన్నారు.







































