రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను మార్చ్ 23, సోమవారం నాడు సుప్రీంకోర్టు కోట్టి వేసింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ భవనాలతో సహా ఇతర ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసివుంటే వాటిని తొలగించి ఆ స్థానంలో వేరే రంగులు వేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల మార్పు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 16న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వేసే అంశంపై ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద విచారణ జరపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.