సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు

CM Chandrababu Announces One-Man Committee After SIT Report into TTD Ghee Adulteration

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు సంస్థా (సిట్) తుది నివేదికను సమర్పించిన నేపథ్యంలో.. పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారానికి సంబంధించి సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అపచారాన్ని దేవుడిపై జరిగిన అతిపెద్ద నేరంగా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా దీని వెనుక ఉన్న సూత్రధారులను కనిపెట్టేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరియు సిట్ (SIT) నివేదికపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యాంశాలు:

1. నేను ఆధారాలతోనే మాట్లాడాను:

  • తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై తాను చేసిన ఆరోపణలు వాస్తవమని సిట్ నివేదిక ద్వారా నిరూపితమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
  • “నేను ఎన్‌డీడీబీ (NDDB) రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆధారాలతో మాట్లాడాను. అప్పుడు నానా యాగీ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిన వారు ఇప్పుడు సిట్ నివేదిక చూశాక ఏమంటారు?” అని ఆయన ప్రశ్నించారు.
  • గత ప్రభుత్వ హయాంలో 2022లోనే సీఎఫ్‌టీఆర్‌ఐ (CFTRI) కల్తీ జరిగిందని హెచ్చరించినా, నాటి టీటీడీ పాలకమండలి దానిని తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు.

2. దోషులపై కఠిన చర్యలు మరియు వన్-మెన్ కమిటీ:

  • సిట్ నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా పరిపాలనాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
  • ఈ వ్యవహారంలో గత టీటీడీ ఉన్నతాధికారులు (ఈవో, ఏఈవో స్థాయి వ్యక్తులు) మరియు కాంట్రాక్ట్ పొందిన సంస్థల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయని సీఎం తెలిపారు.
  • ఈ లొసుగులను శాశ్వతంగా సరిదిద్దేందుకు మరియు భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా తగిన సూచనలు చేసేందుకు ఒక వన్-మెన్ కమిటీని నియమిస్తున్నట్లు చంద్రబాబు ఈరోజు ప్రకటించారు.

3. దేవుడితో ఆటలాడవద్దు:

  • శ్రీ వేంకటేశ్వర స్వామి తన ఇలవేల్పు అని, 2003లో అలిపిరి బాంబు దాడి నుంచి స్వామివారే తనను కాపాడారని చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు.
  • “దేవుడి ప్రసాదాన్ని కూడా వదలకుండా కల్తీ చేయడం మహాపాపం. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రతను దెబ్బతీసే వారిని కాలమే శిక్షిస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
  • తాము అధికారంలోకి రాగానే టీటీడీని ప్రక్షాళన చేసి, పారదర్శకమైన టెండర్ విధానాన్ని పునరుద్ధరించామని ఆయన వివరించారు.

విచారణతోనే సరిపెట్టకుండా..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ నివేదికను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షంపై ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా వైకాపా నేతలు తనను క్షమాపణలు కోరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వన్-మెన్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ వ్యవహారాన్ని కేవలం విచారణతోనే సరిపెట్టకుండా, వ్యవస్థాత్మక మార్పుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది భక్తుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచడంతో పాటు రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వానికి మైలేజీ ఇచ్చే అంశంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here