ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో.. ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ దిగువ భాగాన ఉన్న అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకూ 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
బ్యారేజీలోని 70 గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది. 2009వ సంవత్సరం అక్టోబర్లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద రాగా.. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు రికార్డుల్లో ఉంది.
మరోవైపు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ దగ్గర ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల వరకూ వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకోవడంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి నడుపుతున్నారు. దీంతో పాటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇటు.. ప్రకాశం బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి రావడంతో ..రామలింగేశ్వర నగర్ మునిగిపోయింది. దీంతో అక్కడ ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి బయటకి వెళ్లిపోతున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకూ ప్రజలు సురక్షితంగా ఉన్నారు.
కానీ శ్మశానం రోడ్ దగ్గర ఉన్న గోడ పైనుంచి కూడా లోపలకు వరద నీరు వచ్చి చేరి..మొత్తం వెనక్కి తన్నడంతో నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది. దీంతో దివిసీమను కూడా వరద తీవ్రత తాకేసింది. పులిగడ్డ దగ్గర 21 అడుగులకు వరద నీళ్లు చేరడంతో.. పులిగడ్డ అక్విడెక్టు వరద నీటిలో చిక్కుకు పోయింది. మోపిదేవి మండలంలోని కె.కొత్త పాలెం ఎస్సీ వాడలోకి వరద నీళ్లు రావడంతో కాలనీలో నివాసముంటున్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.