ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రజల క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎంతోమంది హర్షం వ్యక్తం చేశారు.
ప్రతినెల 1వ తేదీనే పెన్షన్ దారులకు పింఛన్ అందించే విధంగా కూటమిప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇదే క్రమంలో తాజాగా పెన్షన్దారుల కోసం చంద్రబాబు ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లను అందించడానికి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంటే ఆగస్ట్ 31నే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఆగస్టు 28న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 1 ఆదివారం పడుతుంది. ఆరోజు సెలవు రోజు కావడంతో ఒక రోజు.. ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదైనా కారణం వల్ల ఆగస్ట్ 31న పెన్షన్లు అందకపోతే మాత్రం.. సెప్టెంబర్ 2వ తేదీన అందరికి అందించనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పింఛన్ పెంచిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 4,000 రూపాయలకి పెంచింది. మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ 3000 నుంచి 4000 వేలకు పెంచారు.
వృద్ధాప్య, వితంతువులు,ఒంటరి మహిళలు,ట్రాన్స్ జెండర్, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, డప్పు కళాకారులకు, హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులలో యాంటీరెట్రో వైరల్ థెరపీ ఉన్నవారికి, కళాకారులకు ఇలాంటి కేటగిరీల్లో ఉన్నవారికి 3,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచింది.
వికలాంగులకు, మల్టీడిఫార్మిటీ లెప్రసీలకు పింఛన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెన్షన్ను పెంచింది. పూర్తి స్థాయి అంటే వీల్ చైర్, బెడ్కే పరిమితం అయిన పక్షవాతంతో ఉన్నవారు, తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు పెన్షన్ 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో 5,000 నుంచి 10,000రూపాయలకి పెంచింది కూటమి ప్రభుత్వం.