ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తదుపరిగా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) జస్టిస్ వి.కనగరాజ్ ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉండడం, అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ పక్రియను మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల వాయిదాకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు హైకోర్టు రిజిస్ట్రార్కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని అందించింది.
ముందుగా రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చ్ 15 న అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ గడువు ఏప్రిల్ 26 తో ముగియడంతో ఇటీవలే రాష్ట్ర నూతన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించి, తాజా పరిస్థితుల దృష్ట్యా మరోసారి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu